Thursday, February 7, 2013

గుర్తుకొచ్చింది..... ఓ మంచి పాట - 7


జరుగుతున్నది జగన్నాటకం (2)
పురాతనపు పురాణ వర్ణన పైకి
కనబడుతున్న కథనం
నిత్య జీవన సత్యమని
భాగవత లీలల అంతరార్థం
ఈ రహస్యము గ్రహించే మతికెరుక
గలుగును పరమతత్త్వం
జరుగుతున్నది జగన్నాటకం (2)

మత్స్వావతారం
చెలియలికట్టను తెంచుకొని
విలయము విజృంభించునని
ధర్మమూలమే మరచిన జగతిని
యుగాంతమెదురై ముంచునని
సత్యవ్రతునకు సాక్షాత్కరించి
సృష్టి రక్షణకు చేయూతనిచ్చి
నావగ త్రోవను చూపిన మత్స్యం
కాలగతిని సవరించిన సాక్ష్యం

కూర్మావతారం
చేయదలచిన మహత్కార్యము
మోయజాలని భారమైతే
పొందగోరినదందలేదని నిరాశలో
అణగారిపోతే
బుసలు కొట్టే అసహనపు నిట్టూర్పు
సెగలకు నీరసించక
ఓటమిని ఓడించగలిగిన
ఓరిమే కూర్మమన్నది
క్షీరసాగరమథన మర్మం

వరాహావతారం
ఉనికిని నిలిపే ఇలను కడలిలో
కలుపగనురికే ఉన్మాదమ్మును
కరాళదంష్ట్రల కుళ్లగించి
ఈ ధరాతలమ్మును ఉద్ధరించగల
ధీరోద్ధత రణహుంకారం
ఆదివరాహపు అవతారం

నరసింహావతారం
ఏడీ ఎక్కడరా... నీ హరి?
దాక్కున్నాడేరా భయపడి?
బయటకు రమ్మనరా ఎదుటపడి
నన్ను గెలవగలడా కలబడి?
నువు నిలిచిన ఈ నేలను అడుగు
నీ నాడుల జీవజలమ్మును అడుగు
నీ నెత్తుటి వెచ్చదనాన్నడుగు
నీ ఊపిరిలో గాలిని అడుగు
నీ అణువుల ఆకాశాన్నడుగు
నీలో న రునీ హరినీ క లుపు
నీవే నరహరివని నువు తెలుపు
ఉన్మత్త మాతంగ
భంగి ఘాతుక వితతి
హంతృసంఘాత నిర్ఘృణ
నిబిడమీ జగతి
అఘము నగమై ఎదిగె
అవనికిది అశని హతి
ఆతతాయుల నిహతి
యనివార్యమౌ నియతి
జితహస్తి హతమస్తకాశి
నఖసమకాశియో
క్రూరాసి గ్రోసి
హుత్‌వాహు దంష్ట్రుల దోసి
మసి జేయు మహిత యజ్ఞం

వామనావతారం
అమేయమనూహ్యమనంత విశ్వం
ఆ బ్రహ్మాండపు సూక్ష్మస్వరూపం...
ఈ మానుషరూపం
కుబ్జాకృతిగా బుద్ధిని
భ్రమింపజేసే అల్పప్రమాణం
ముజ్జగాలనూ మూడడుగులతో
కొలిచే త్రైవిక్రమ విస్తరణం

పరశురామావతారం
రుక్షేక్షణోద్గీర్ణ దీక్షారణీ మన్థనోద్ఘాత
ప్రస్ఫురద్విస్ఫుకణమిదమ్ క్షాత్రమ్
ధృత్వరక్షాదక్ష ధృష్ట దమ
దిదృక్షా దధత్ ధిషణా
దృఘణమిద్ బ్రాహ్మ్యమ్
వీతరాగుడై జితక్రోధుడై
శమదమాది శుభలక్షణాత్ముడై
శాంతిధామమౌ స్వాంతము గలిగిన
సాధుజీవనుడు శ్రోత్రియుడు
పాపపు తరువై పుడమికి బరువై
పెరిగిన ధర్మగ్లానిని పెరుకగ
పరశురాముడై... భయద భీముడై... ధర్మాగ్రహ విగ్రహుడై నిలచిన
శాత్రవాంతకుడు క్షత్రియుడు
సాత్త్విక రాజస గుణ సద్విభజన
తెలిపిన తత్త్వమె భార్గవుడు

రామావతారం
శ్లోకం : ఆత్మానమ్ మానుషమ్
మన్యే రామమ్ దశరథాత్మజమ్

మనిషిగానే పుట్టి మనిషిగానే బ్రతికి
మహిత చరితగ మహిని
మిగలగలిగే మనికి
సాధ్యమేనని మనకి తెలిపె భవుని రామమూర్తిగా హరియె నిలిచె
ఏ మహిమలు లేక ఏ మాయలు లేక
నమ్మశక్యము గాని ఏ మర్మము లేక
నిష్ఠతో ధర్మకర్మాచరణమె చాలు మట్టిబొమ్మయె పరబ్రహ్మగా
రాజిల్లు
అట్టి మర్యాదాపురుషోత్తముని
నామమననమె పరంధామ
మందగ జాలు
రామావతార తారక మంత్ర మవక దైవమంటే మనిషి బుద్ధికే మెరుక?

శ్రీకృష్ణావతారం
ఇన్ని రీతులుగా
ఇన్నిన్ని పాత్రలుగా...
నిన్ను నీకే నూత్న పరిచితునిగా
దర్శింపజేయగల
జ్ఞానదర్పణము... కృష్ణావతరణ స్మరణమే సృష్ట్యావరణ తరణము
అణిమగా మహిమగా
గరిమగా లఘిమగా ప్రాప్తిగా
ప్రాకామ్యవర్తిగా ఈశత్వముగా
వశిత్వమ్ముగా
నీలోని అష్టసిద్ధులునీకు కన్పట్టగా...
స్వస్వరూపమే విశ్వరూపమ్ముగా...
నరుని లోపలి పరునిపై
దృష్టి పరుపగా
తలవంచి కైమోడ్చి శిష్యుడవు నీవైతే
నీ ఆర్తి కడతేర్చు ఆచార్యుడవు నీవె
యన్న ఉపదేశమై ఉషనిషత్సారమే
యున్న భగవద్గీత ఉగ్గడించును
నరుడ నీకు నీ హృద్బోధ

వందే కృష్ణం జగద్గురుమ్

చిత్రం : కృష్ణం వందే జగద్గురుమ్
రచన : సిరివెన్నెల,
సంగీతం : మణిశర్మ
గానం : ఎస్.పి.బాలు, బృందం

Monday, February 4, 2013

ఎండ్రకాయ దినం! (Cancer Day)

క్యాన్సర్‌కు ఆయుర్వేద చికిత్స
Article by
డాక్టర్ వృద్ధుల లక్ష్మీనరసింహశాస్త్రి, అడిషనల్ డెరైక్టర్ (రిటైర్డ్), 
(ఆయుర్వేద) ఆయుష్, సౌభాగ్య ఆయుర్వేదిక్ క్లినిక్, ఎన్‌ఎమ్‌డీసీ దగ్గర, హైదరాబాద్

సందర్భం - నేడు - వరల్డ్ క్యాన్సర్ డే (FEB 4)
ఆయుర్వేదంలో ప్రాచీనవైద్యుడు చరకమహర్షి నిరూపించిన విషయం: శరీరంలోని ఏ అవయవానికైనా, ఏ భాగానికైనా మూలం కంటికి కనబడని సూక్ష్మాతిసూక్ష్మమైన, అసంఖ్యాకమైన పరమాణు సముదాయమే. (శరీరావయాస్తు పరమాణు భేదానం ఆపరిసంఖ్యేయా భవంతి, అతిబహుత్వాత్, అతి సౌక్ష్మాత్, అతీంద్రియ త్వాత్ చ). ఇలాంటి పరమాణువుల స్వభావ క్రియ భేదాల వల్ల సప్త ధాతువులైన... రస, రక్త, మాంస, మేదో, అస్థి, మజ్జా, శుక్రాలు’, వాటి తో పాటు వివిధ స్రోతస్సులు ఉత్పత్తి కాబడ్డాయి. 

క్యాన్సర్ అనే పదానికి అర్థం ‘ఎండ్రకాయ’ (కర్కాటకం). నిశ్శబ్దంగా దొలిచి దొలిచి ధ్వంసం చేయడానికి ఇది పెట్టింది పేరు. వ్యాధి స్వభావాన్ని బట్టి దీనికి ఈ పేరు వచ్చింది. ఇలాంటి స్వభావం గల వ్యాధులు ఆయుర్వేదంలో చాలా వాటిని వర్ణించారు. ఈ వ్యాధి సోకిన ధాతువును బట్టి, స్రోతస్సును బట్టి, అవయవాన్ని బట్టి, భాగాన్ని బట్టి పేరు మారుతుంటుంది. పైన చెప్పిన వాటిలో దేనికి సంబంధించినవైనా కొన్ని అణువులు ‘నివారింపశక్యంకాకుండా, అవాంఛితంగా పరిమాణంలో పెరిగిపోతుండటమే’ ఈ వ్యాధిలో జరిగే ప్రక్రియ. అణువిభజనకు వాతం (న్యూక్లియస్ కర్మలు), పచింపబడటానికి పిత్తం (మైటోకాండ్రియా కర్మలు), పోషణకు కఫం (ప్రోటోప్లాజం కర్మలు) కారణంగా నిలుస్తాయి. 

కొన్ని వ్యాధుల పేర్లు
తీవ్రస్థాయికి చేరిన అర్బుద, గ్రంథి, అపచి, గండమాల మొదలైనవి. అర్బుదాలు (కణుతులు), తాలువు, నాలుక, ముక్కు, చెవి, రొమ్ముల్లో కూడా పుడతాయని వాగ్భటాచార్యులు ప్రత్యేకంగా చెప్పారు. అదేవిధంగా ఉపద్రవస్థాయికి చేరిన రస మరియు రక్తవహస్రోతో దుష్టి లక్షణాలే ఈ నాటి బ్లడ్‌క్యాన్సర్లు. 

వ్యాధికి కారణాలు
అసలు కారణం స్పష్టంగా తెలియదు. వాతపిత్తకఫాల ప్రాకృత కర్మలను చెడగొట్టే ఆహార విహారాలు, ధూమ, మద్యపానాలు, ఇతర మాదకద్రవ్యాలు, విపరీతమైన మానసిక ఒత్తిడి కారణాల్లో కొన్ని. ప్రస్తుతం సమాజంలో 90 శాతం ఆహారపదార్థాలు, పాలు, తినుబండారాలు, నూనెలు, పండ్లు సమస్తం కల్తీయే. ఇది కూడా ఈ ‘కర్కశకర్కాటకాని’కి కారణమే. 

చికిత్స
వ్యాధి తీవ్రతను బట్టి ‘ప్రవర, మధ్యమ, అవర’ అని విభజించబడింది. ప్రవరావస్థలో ఫలితాలు బాగుంటాయి. ఆయుర్వేదం కేవలం రోగవ్యతిరేక చికిత్స మాత్రమే కాకుండా రోగికి బలవర్థకమైన ‘రసాయన’ చికిత్స, అవసరాన్ని బట్టి శోధన (పంచకర్మ) చికిత్స, శస్త్రచికిత్సతో పాటు రోగం సోకిన భాగాన్ని బట్టి ఎన్నో ఔషధాలను విశదీకరించింది. 

కొన్ని ముఖ్య ఔషధాలు 
ఏకద్రవ్యాలు: 
భల్లాతకీ (నల్లజీడిగింజ) 
అమృతా/గుడూచీ (తిప్పతీగె) 
చిత్రక (చిత్రమూలం) 
హరిద్రా (పసుపు) 
అశ్వగంధ (పెన్నేరుగడ్డ) ప్రధానమైనవి. 

ఇతర ఏకమూలికలలో: శిరీశ్రీ (దిరిసెన), సీతాఫల, తులసి, మారేడు, తమలపాకు, లశున (వెల్లుల్లి), నేల ఉసిరిక (భూమ్యామలకి), కటుకరోహిణి, బ్రాహ్మీ, శతావరీ (పిల్లిపీచర), అశోక, మంజిష్ఠ, దుగ్ధిక, త్రిఫలాలు (కరక్కాయ, తానికాయ, ఉసిరి), పాషాణభేది (కొండపిండి) మొదలైనవి చాలా చెప్పబడ్డాయి. 

మిశ్రమ ఔషధాలు: 
భల్లాతకీ లేహ్యం 
అమృత భల్లాతకీ లేహ్యం 
అగస్త్యరసాయనం 
అశ్వగంధాది లేహ్యం 
చిత్రకహరీతకీ రసాయనం 
ఆమలకీ రసాయనం 
గుడూచీసత్వం మొదలైనవి. 

గమనిక: రోగి బలాన్ని, వ్యాధి సోకిక భాగాన్ని, అవయవాన్ని బట్టి ఏ ఔషధం, ఏ రూపంలో, ఎంతకాలం వాడాలో ఆయుర్వేద నిపుణులు నిర్ణయించి, పర్యవేక్షించాలేగాని, బైరాగి చిట్కాలు, సాధువుల వైద్యాలు క్యాన్సరును పోగొట్టలేవు. అలాంటి ప్రకటనలకు మోసపోవద్దు. 

ఆయుర్వేద మార్గంలో నివారణ
బాల్యం నుంచి శాస్త్రబద్ధంగా కల్తీలు లేని, బలవర్ధకమైన సాత్వికాహార సేవన ఆవునెయ్యి, నువ్వుల నూనె రోజూ రెండేసి చెంచాలు సేవించాలి 

పాలు, పెరుగు, వెన్నలు ఆవువైతేనే శ్రేష్ఠం. ఇవి రోగనిరోధకశక్తిని పెంపొందిస్తాయి 

పరిమిత వ్యాయామం, జీవితాంత ప్రక్రియగా భావించి, ప్రతిదినం చేయాలి 

దూమ, మద్యపానాల వంటి వ్యసనాలకు దూరంగా ఉండాలి 

రాత్రి కనీసం ఏడు గంటలు నిద్రించి బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేవాలి 

మానసికారోగ్యం కాపాడుకోవడం ప్రధానం. కాబట్టి సంతోషం, శాంతం, ఉత్సాహం, కారుణ్యం వంటి లక్షణాలను అనుసరించాలి. (తనకోపమె తన శత్రువు, తన శాంతమె తనకు రక్ష). వీటిని ఆయుర్వేదంలో ‘ఆచార రసాయనా’లంటారు 

ఉసిరికాయరసం రోజూ రెండు చెంచాలు తాగాలి లేదా త్రిఫలా చూర్ణం రోజూ ఒక చెంచా తేనెతో 
పది తులసి ఆకులు, ఐదు మారేడు ఆకులు నమిలి తినాలి .ఏదో ఒక తాజా ఫలం ప్రతిరోజూ తినాలి.

Dedicated to all Cancer Survivors in the world
in public interest by BHADRASIMHA
Article in Sakshi Newspaper webpage


LinkWithin

Related Posts with Thumbnails